అపొస్తలుల కార్యములు 13:16-41
16
పౌలు లేచి నిలబడి తన చేతితో సైగ చేస్తూ, “తోటి ఇశ్రాయేలీయులారా, దేవుని ఆరాధించే యూదేతరులారా, నా మాటలను వినండి!
17
ఇశ్రాయేలు దేశ ప్రజల దేవుడు మన పితరులను ఎన్నుకుని, వారిని ఈజిప్టులో అభివృద్ధిపరచి, వారిని తన గొప్ప శక్తితో ఆ దేశం నుండి బయటకు రప్పించారు.
18
రప్పించిన తర్వాత నలభై సంవత్సరాలు అరణ్యంలో వారి ప్రవర్తనను సహించారు,
19
కనాను దేశంలోని ఏడు జాతుల వారిని తరిమివేసి, వారి దేశాన్ని తన ప్రజలకు స్వాస్థ్యంగా ఇచ్చారు.
20
సుమారు నాలుగు వందల యాభై సంవత్సరాలు ఈ సంఘటనలన్ని జరిగాయి. “ఆ తర్వాత, సమూయేలు ప్రవక్త కాలం వరకు దేవుడు వారికి న్యాయాధిపతులను ఇచ్చారు.
21
తర్వాత ప్రజలు తమకు రాజు కావాలని అడిగినప్పుడు, దేవుడు బెన్యామీను గోత్రానికి చెందిన కీషు కుమారుడైన సౌలును వారికి రాజుగా ఇచ్చారు, అతడు వారిని నలభై సంవత్సరాలు పరిపాలించాడు.
22
సౌలును తొలగించిన తర్వాత, దావీదును వారికి రాజుగా చేశాడు. దేవుడు అతని గురించి, ‘యెష్షయి కుమారుడైన దావీదును నేను కనుగొన్నాను, అతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు. నేను చేయాలని ఉద్దేశాలన్నిటిని అతడు నెరవేరుస్తాడు’ అని సాక్ష్యమిచ్చారు.
23
“దేవుడు తాను చేసిన వాగ్దానం ప్రకారం, దావీదు సంతానం నుండి ఇశ్రాయేలు ప్రజల కోసం యేసు రక్షకుని పుట్టించారు.
24
యేసు రాకముందు, పశ్చాత్తాపం బాప్తిస్మం గురించి యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికి బోధించాడు.
25
యోహాను తాను వచ్చిన పనిని ముగిస్తూ, ‘నేను ఎవరని మీరు అనుకుంటున్నారా? మీరు ఎదురు చూస్తున్న వానిని నేను కాదు. కాని నా తర్వాత వస్తున్న వాని చెప్పులు విప్పడానికి కూడా నేను యోగ్యున్ని కాదు’ అన్నాడు.
26
“తోటి అబ్రాహాము సంతానమా దేవుని భయభక్తులు గల ఇతర జాతుల వారలారా, ఈ రక్షణ సందేశం మన కొరకే పంపబడినది.
27
యెరూషలేము ప్రజలు వారి పరిపాలకులు యేసును గుర్తు పట్టలేదు, కాని వారు యేసుకు మరణశిక్షను విధించుట ద్వార ప్రతి సబ్బాతు దినాన చదవబడే ప్రవక్తల మాటలను నెరవేర్చారు.
28
ఆయనలో మరణశిక్షకు తగిన ఏ ఆధారం కనబడకపోయినా, ఆయనను చంపాలని వారు పిలాతును వేడుకొన్నారు.
29
ఆయన గురించి వ్రాయబడిన వాటన్నిటిని వారు నెరవేర్చిన తర్వాత, ఆయనను సిలువ మీది నుండి దించి సమాధిలో పెట్టారు.
30
కానీ దేవుడు ఆయనను మరణం నుండి సజీవునిగా లేపారు.
31
ఇంకా ఆయన గలిలయ నుండి యెరూషలేముకు తనతో ప్రయాణం చేసినవారికి చాలా రోజులు కనిపించారు. వారే ఇప్పుడు మన ప్రజలకు సాక్షులుగా ఉన్నారు.
32
“మేము మీకు చెప్పే సువార్త ఏంటంటే: దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం,
33
యేసును మరణం నుండి లేపడం ద్వారా ఆయన పిల్లలంగా ఉన్న మన కోసం నెరవేర్చారు. రెండవ కీర్తనలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ ‘నీవు నా కుమారుడవు; ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను.’
34
ఆయన ఎప్పటికీ కుళ్ళిపోకూడదని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపారు. దేవుడు చెప్పినట్లే, “ ‘నేను దావీదుకు వాగ్దానం చేసిన పవిత్రమైన, నమ్మదగిన దీవెనలను మీకు అనుగ్రహిస్తాను.’
35
మరి ఒకచోట ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ ‘మీ పరిశుద్ధుని కుళ్లిపోనీయరు.’
36
“దావీదు తన తరంలో దేవుని చిత్తాన్ని జరిగించిన తర్వాత, చనిపోయాడు; అతడు అతని పితరుల వలె పాతిపెట్టబడగా అతని శరీరం కుళ్ళిపోయింది.
37
కానీ దేవుడు మరణం నుండి లేపినవాని శరీరం కుళ్ళు పట్టలేదు.
38
“కాబట్టి, నా స్నేహితులారా, యేసు ద్వారానే పాపక్షమాపణ కలుగునని ప్రకటించబడింది అని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను.
39
ఎందుకంటే, మోషే ధర్మశాస్త్రం ద్వారా మిమ్మల్ని నిర్దోషులుగా తీర్చడం సాధ్యం కాలేదు, కాని క్రీస్తు యేసును నమ్మిన ప్రతి ఒక్కరు ఆయన ద్వారా ప్రతి పాపం నుండి విడుదల పొంది నిర్దోషిగా తీర్చబడుతున్నారు.
40
కానీ ప్రవక్తలు ముందుగానే చెప్పినది మీమీద రాకుండా ఉండాలని జాగ్రత్తగా చూసుకోండి అవేమంటే:
41
“ ‘చూడండి, ఎగతాళి చేసేవారలారా, ఆశ్చర్యపడి నశించిపోయేవారలారా వినండి, నేను మీ రోజుల్లో ఒక కార్యాన్ని చేయబోతున్నాను, దాని గురించి మీకు ఎవరు వివరించినా దానిని మీరు నమ్మలేరు.’”
Settings