అపొస్తలుల కార్యములు 13:42-52
42
పౌలు బర్నబా సమాజమందిరంలో నుండి వెళ్తున్నప్పుడు, మరో సబ్బాతు దినాన కూడా ఈ సంగతుల గురించి మళ్ళీ చెప్పాలని ప్రజలు వారిని బ్రతిమలాడారు.
43
వచ్చినవారు వెళ్లిపోయిన తర్వాత, చాలామంది యూదులు, యూదా మతంలోనికి మారిన వారు, దేవుని కృపలో కొనసాగాలని తమతో మాట్లాడి, తమను బ్రతిమాలిన పౌలును బర్నబాను వెంబడించారు.
44
మరుసటి సబ్బాతు దినాన ఇంచుమించు ఆ పట్టణమంతా ప్రభువు వాక్కును వినడానికి చేరుకొన్నారు.
45
యూదులు ఆ జనసమూహాన్ని చూసి అసూయపడ్డారు. పౌలు చెప్పిన మాటలకు వ్యతిరేకించడం మొదలుపెట్టి అతని మీద నిందలను మోపసాగారు.
46
అయితే పౌలు బర్నబాలు ధైర్యంగా వారికి సమాధానం ఇచ్చారు: “మేము దేవుని వాక్యాన్ని మీకు మొదట బోధించాలి. కానీ మీరు దానిని తిరస్కరించి నిత్యజీవానికి అర్హులుగా ఎంచుకోలేదు, కాబట్టి మేము యూదేతరుల దగ్గరకు వెళ్తున్నాము.
47
ప్రభువు మాకు ఇచ్చిన ఆజ్ఞ ఇదే: “మీరు భూమి అంచుల వరకు రక్షణను తెచ్చేవారిలా, నేను మిమ్మల్ని యూదేతరులకు వెలుగుగా నియమించాను.”
48
అప్పుడు యూదేతరులు ఈ మాటలు విని సంతోషించి ప్రభువు వాక్యాన్ని గౌరవించారు. నిత్యజీవం కోసం నియమించబడిన వారందరు నమ్మారు.
49
ఆ ప్రదేశమంతటా ప్రభువు వాక్యం వ్యాపించింది.
50
కానీ యూదా నాయకులు దైవభయం కలిగిన స్త్రీలను ఆ పట్టణ ప్రముఖులను ప్రేరేపించి, పౌలు బర్నబాలకు వ్యతిరేకంగా హింస కలుగచేసి వారిని తమ ప్రాంతం నుండి తరిమివేశారు.
51
కాబట్టి వారు హెచ్చరికగా తమ పాదాల దుమ్మును దులిపివేసి అక్కడినుండి ఈకొనియ పట్టణానికి వెళ్లిపోయారు.
52
ఆ ప్రాంతపు శిష్యులు పరిశుద్ధాత్మతో ఆనందంతో నింపబడ్డారు.
Settings