2 సమూయేలు 23:16
చుట్టుపక్కల సందర్భంతో వచనం 16 చూపబడుతోంది.
13
కోతకాలంలో ముప్పైమంది ముఖ్య యోధులలో ముగ్గురు అదుల్లాము గుహ దగ్గర ఉన్న దావీదు దగ్గరకు వచ్చారు. అప్పుడు ఫిలిష్తీయుల సైనికుల గుంపు రెఫాయీము లోయలో శిబిరం ఏర్పరచుకుంది.
14
ఆ సమయంలో దావీదు సురక్షితమైన స్థావరంలో ఉన్నాడు, ఫిలిష్తీయుల దండు బేత్లెహేములో ఉంది.
15
దావీదు నీళ్ల కోసం ఆరాటపడుతూ, “బేత్లెహేము ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్లు ఎవరైనా నాకు తెచ్చి ఇస్తే ఎంత బాగుండేది!” అన్నాడు.
16
అప్పుడు ఆ ముగ్గురు వీరులు ఫిలిష్తీయుల శిబిరం గుండా చొరబడి బేత్లెహేము ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్లు తోడుకొని దావీదుకు తెచ్చి ఇచ్చారు. అయితే అతడు ఆ నీళ్లు త్రాగడానికి నిరాకరించాడు; బదులుగా వాటిని యెహోవాకు అర్పణగా పారబోశాడు.
17
“యెహోవా! ఈ నీళ్లు నేను త్రాగగలనా? వీరు తమ ప్రాణాలకు తెగించి తెచ్చిన నీళ్లు వారి రక్తంతో సమానం కాదా?” అని చెప్పి వాటిని త్రాగలేదు. ఆ ముగ్గురు పరాక్రమ యోధులు చేసిన సాహసాలు ఇలాంటివి.
18
సెరూయా కుమారుడు, యోవాబు సోదరుడైన అబీషై ఆ ముగ్గురికి నాయకుడు. ఒక యుద్ధంలో అతడు తన ఈటెను ఆడిస్తూ మూడువందల మందిని చంపాడు, కాబట్టి అతడు ఆ ముగ్గురిలా ప్రసిద్ధి పొందాడు.
19
అతడు ఆ ముగ్గురికంటే గొప్ప గౌరవాన్ని పొంది వారి దళాధిపతి అయ్యాడు కాని వారిలో ఒకనిగా చేర్చబడలేదు.
Settings