2 సమూయేలు 18:19-27
19
తర్వాత సాదోకు కుమారుడైన అహిమయస్సు, “నేను రాజు దగ్గరకు పరుగెత్తి వెళ్లి, యెహోవా రాజును తన శత్రువుల చేతిలో నుండి విడిపించి రాజుకు న్యాయం చేశారని చెప్పనివ్వండి” అని అడిగాడు.
20
అందుకు యోవాబు, “ఈ వార్తను ఈ రోజు నీవు మోసుకెళ్లవద్దు ఎందుకంటే తన కుమారుడు చనిపోవడం రాజుకు శుభవార్త కాదు కదా! నీవు మరోసారి నా దూతగా వార్తను మోసుకెళ్దువులే” అని అతనితో చెప్పాడు.
21
తర్వాత యోవాబు కూషీయున్ని పిలిచి, “నీవు వెళ్లి, నీవు చూసిన దానిని రాజుకు చెప్పు” అని చెప్పాడు. ఆ కూషీయుడు యోవాబుకు నమస్కారం చేసి పరిగెత్తుకొని వెళ్లాడు.
22
అయితే సాదోకు కుమారుడైన అహిమయస్సు యోవాబును, “ఏమైనా కానివ్వండి, నేను కూషీయుని వెంట పరుగెడతాను; నన్ను వెళ్లనివ్వండి” అని మరోసారి వేడుకున్నాడు. కాని యోవాబు, “నా కుమారుడా, నీవెందుకు వెళ్లాలనుకుంటున్నావు? నీకు బహుమతిని తెచ్చే వార్తేమి నీ దగ్గర లేదు” అన్నాడు.
23
అయితే అతడు, “ఏది ఏమైనా సరే, నేను వెళ్తాను” అన్నాడు. కాబట్టి యోవాబు, “సరే పరుగెత్తు” అన్నాడు. అహిమయస్సు మైదానం మీదుగా పరుగెత్తుకొని వెళ్లి కూషీయుని కంటే ముందుగా చేరుకున్నాడు.
24
దావీదు రెండు గుమ్మాల మధ్యలో కూర్చుని ఉన్నాడు. కావలివాడు గుమ్మం పైనున్న గోడ మీదికి ఎక్కి చూస్తున్నప్పుడు, ఒక వ్యక్తి ఒంటరిగా పరుగెత్తుకొని రావడం కనిపించింది.
25
కావలివాడు గట్టిగా అరిచి రాజుకు ఆ సంగతి చెప్పాడు. రాజు, “అతడు ఒంటరిగా వస్తున్నాడంటే ఒకవేళ మంచివార్తనే తెస్తున్నాడేమో” అన్నాడు. పరుగెడుతూ వస్తున్నవాడు మరింత దగ్గరకు వచ్చాడు.
26
అప్పుడు కావలివాడు మరొక వ్యక్తి పరిగెత్తుకు రావడం చూసి ద్వారపాలకునితో, “అదిగో, మరొకడు ఒంటరిగా పరుగెత్తుకు వస్తున్నాడు” అని గట్టిగా చెప్పాడు. రాజు, “అతడు కూడా మంచివార్తనే తెస్తున్నాడేమో” అన్నాడు.
27
కావలివాడు, “మొదట పరుగెత్తుకొని వస్తున్నవాడు సాదోకు కుమారుడైన అహిమయస్సులా పరుగెడుతున్నట్టుంది” అని అన్నాడు. అందుకు రాజు, “అతడు మంచివాడు, మంచివార్తనే తెస్తున్నాడేమో” అని అన్నాడు.
Settings