2 సమూయేలు 18:24-32
24
దావీదు రెండు గుమ్మాల మధ్యలో కూర్చుని ఉన్నాడు. కావలివాడు గుమ్మం పైనున్న గోడ మీదికి ఎక్కి చూస్తున్నప్పుడు, ఒక వ్యక్తి ఒంటరిగా పరుగెత్తుకొని రావడం కనిపించింది.
25
కావలివాడు గట్టిగా అరిచి రాజుకు ఆ సంగతి చెప్పాడు. రాజు, “అతడు ఒంటరిగా వస్తున్నాడంటే ఒకవేళ మంచివార్తనే తెస్తున్నాడేమో” అన్నాడు. పరుగెడుతూ వస్తున్నవాడు మరింత దగ్గరకు వచ్చాడు.
26
అప్పుడు కావలివాడు మరొక వ్యక్తి పరిగెత్తుకు రావడం చూసి ద్వారపాలకునితో, “అదిగో, మరొకడు ఒంటరిగా పరుగెత్తుకు వస్తున్నాడు” అని గట్టిగా చెప్పాడు. రాజు, “అతడు కూడా మంచివార్తనే తెస్తున్నాడేమో” అన్నాడు.
27
కావలివాడు, “మొదట పరుగెత్తుకొని వస్తున్నవాడు సాదోకు కుమారుడైన అహిమయస్సులా పరుగెడుతున్నట్టుంది” అని అన్నాడు. అందుకు రాజు, “అతడు మంచివాడు, మంచివార్తనే తెస్తున్నాడేమో” అని అన్నాడు.
28
అహిమయస్సు, “అంతా క్షేమమే” అని అరుస్తూ, రాజు నేలకు తలవంచి నమస్కారం చేసి, “మీ దేవుడైన యెహోవాకు స్తోత్రం! నా ప్రభువైన రాజుకు వ్యతిరేకంగా ఉన్నవారిని ఆయన మనకు అప్పగించారు” అన్నాడు.
29
అందుకు రాజు, “యువకుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?” అని అడిగాడు. అందుకు అహిమయస్సు, “యోవాబు మీ సేవకుడనైన నన్ను, రాజు సేవకున్ని పంపుతున్నప్పుడు చాలా గందరగోళంగా ఉన్నట్లు నేను చూశాను, అయితే అది ఏంటి అనేది నాకు తెలియదు” అని జవాబిచ్చాడు.
30
రాజు, “ప్రక్కకు జరిగి, అక్కడే ఉండు” అన్నాడు. కాబట్టి అతడు ప్రక్కకు జరిగి అక్కడే నిలబడ్డాడు.
31
అంతలో కూషీయుడు వచ్చి, “నా ప్రభువా రాజా! శుభవార్త వినండి! ఈ రోజు యెహోవా మీ మీదికి లేచిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి నీకు న్యాయం చేశారు” అని చెప్పాడు.
32
రాజు కూషీయున్ని, “యువకుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?” అని అడిగాడు. అందుకు కూషీయుడు, “నా ప్రభువైన రాజు యొక్క శత్రువులకు, రాజుకు హాని చేయాలనుకున్న వారందరికి ఆ యువకునికి పట్టిన గతే పట్టాలి” అన్నాడు.
Settings