2 రాజులు 10:18-28
18
తర్వాత యెహు ప్రజలందరినీ సమకూర్చి, “అహాబు బయలుకు కొంచెం సేవ చేశాడు; కాని యెహు మరి ఎక్కువ సేవ చేస్తాడు.
19
కాబట్టి ఇప్పుడు బయలు ప్రవక్తలందరినీ, అతని సేవకులందరినీ, అతని పూజారులందరినీ పిలిపించండి. ఎవరూ మానకుండా అందరు ఉండేలా చూడండి. ఎందుకంటే, నేను బయలుకు గొప్ప బలి అర్పిస్తాను. రాని వారిని బ్రతకనివ్వను” అని వారితో అన్నాడు. అయితే బయలు సేవకులను నాశనం చేద్దామని యెహు ఇలా యుక్తిగా చేశాడు.
20
యెహు, “బయలుకు పవిత్ర సమావేశాన్ని ఏర్పాటు చేయండి” అని చెప్పగా వారలాగే ప్రకటించారు.
21
తర్వాత యెహు ఇశ్రాయేలంతటికి కబురు పంపాడు, బయలు సేవకులంతా వచ్చారు; ఏ ఒక్కడు రాకుండా లేడు. వారంతా బయలు గుడిలో ప్రవేశించగా బయలు గుడి ఈ చివర నుండి ఆ చివర వరకు వారితో నిండిపోయింది.
22
యెహు దుస్తుల గది మీద అధికారితో, “బయలు సేవకులందరికీ అంగీలు తీసుకురా” అని చెప్పాడు. అతడు వారి కోసం అంగీలు తెచ్చాడు.
23
తర్వాత యెహు, రేకాబు కుమారుడైన యెహోనాదాబు బయలు గుడిలోకి వెళ్లారు. యెహు బయలు సేవకులతో, “ఇక్కడ మీ మధ్య యెహోవా సేవకులు ఎవరూ లేకుండా చూడండి, బయలు సేవకులు మాత్రమే ఉండాలి” అని చెప్పాడు.
24
కాబట్టి వారు బలులు, దహనబలులు అర్పించడానికి లోనికి వెళ్లారు. అప్పుడు యెహు తన వారిలో ఎనభైమంది కావలి వారును పిలిచి, ఇలా హెచ్చరించాడు: “మీలో ఎవరైనా నేను మీకు అప్పగించే వారిలో ఎవరినైన తప్పించుకుపోనిస్తే, అతని ప్రాణం కోసం మీ ప్రాణం పెట్టాలి” అని హెచ్చరించాడు.
25
దహనబలి అర్పించడం ముగించాక, యెహు కావలివారితో అధికారులతో, “లోపలికి వెళ్లి వారిని చంపండి; ఎవరిని తప్పించుకోనివ్వకండి” అన్నాడు. కాబట్టి వారు వారిని ఖడ్గంతో చంపారు. కావలివారు, అధికారులు వారి శవాలను బయట పారవేశారు. అప్పుడు వారు బయలు గర్భగుడిలోకి ప్రవేశించారు.
26
వారు బయలు గుడిలో ఉన్న పవిత్ర రాతిని బయటకు తెచ్చి దానిని తగలబెట్టారు.
27
వారు బయలు పవిత్ర స్తంభాన్ని పడగొట్టారు, బయలు గుడిని నేలమట్టం చేసి దానిని మరుగు దొడ్డిగా వాడారు. అది ఇప్పటికీ అలాగే ఉంది.
28
ఇలా యెహు బయలును ఇశ్రాయేలులో లేకుండా చేశాడు.
Settings