రోమీయులకు 11:1-10
1
అందుకు నా ప్రశ్న ఏంటంటే: దేవుడు తన ప్రజలను తిరస్కరిస్తారా? ఎన్నటికీ కాదు! నేను కూడా ఇశ్రాయేలుకు చెందినవాన్నే, అబ్రాహాము సంతానాన్నే, బెన్యామీను గోత్రానికి చెందినవాన్నే.
2
తన ప్రజలను అనగా తాను ముందుగానే ఎరిగి ఉన్నవారిని దేవుడు తిరస్కరించరు. ఏలీయా గురించిన భాగంలో లేఖనం ఏమి చెప్తుందో మీకు తెలియదా? ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా అతడు దేవునికి ప్రార్థన చేస్తూ,
3
“ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపారు, నీ బలిపీఠాలను కూల్చివేశారు, నేను ఒక్కన్ని మాత్రమే మిగిలాను, వారు నా ప్రాణం తీయాలని చూస్తున్నారు” అని ఎంతగానో మొరపెట్టుకున్నాడు.
4
అయితే దేవుడు అతనికిచ్చిన సమాధానం ఏంటి? “బయలుకు మోకరించని ఏడువేలమందిని నా కోసం ప్రత్యేకించుకున్నాను” అని.
5
అదే విధంగా ప్రస్తుత సమయంలో కూడా కృప ద్వారా ఏర్పాటు చేయబడినవారు మిగిలే ఉన్నారు.
6
అది కృప వల్ల అయితే అది క్రియలమూలంగా కలిగింది కాదు. ఒకవేళ అలా కాకపోతే కృప ఇక కృప కాదు.
7
అప్పుడు ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు ఆసక్తితో దేనిని వెదికారో అది వారికి దొరకలేదు. వారిలో ఏర్పరచబడినవారికే అది దొరికింది. కాని మిగిలిన వారు కఠినంగా అయ్యారు.
8
దాని గురించి ఇలా వ్రాయబడింది: “నేటి వరకు దేవుడు వారికి మైకంగల ఆత్మను, చూడలేని కళ్లను వినలేని చెవులను ఇచ్చారు.”
9
దావీదు, “వారి భోజనబల్ల వారికి ఉచ్చుగా బోనుగా మారి వారికి అడ్డుబండగా తగిన శాస్తిగా ఉండును గాక.
10
వారు చూడకుండ వారి కళ్లకు చీకటి కమ్మును గాక, వారి నడుములు శాశ్వతంగా వంగిపోవును గాక” అని చెప్తున్నాడు.
Settings