లేవీయకాండము 10:12-20
12
మోషే అహరోనుతో అతని కుమారులలో మిగతా వారైన ఎలియాజరు, ఈతామారులతో ఇలా అన్నాడు, “యెహోవాకు సమర్పించిన హోమబలిలో మిగిలిన భోజనార్పణ పులుపు లేకుండ తీసుకుని బలిపీఠం ప్రక్కన తినండి, ఎందుకంటే అది అతిపరిశుద్ధమైనది.
13
యెహోవాకు సమర్పించిన హోమబలులలో ఇది మీకు, మీ కుమారులకు ఇచ్చిన వాటా; దీనిని పరిశుద్ధాలయ ప్రాంతంలో తినండి; ఎందుకంటే నాకు అలాగే ఆజ్ఞ ఇవ్వబడింది.
14
కానీ నీవూ, నీ కుమారులు, మీ కుమార్తెలు పైకెత్తిన రొమ్ము భాగాన్ని, ప్రత్యేక అర్పణగా అర్పించిన తొడను తినవచ్చు. ఆచారరీత్య శుభ్రంగా ఉన్న స్థలంలో వాటిని తినండి; అవి నీకు, నీ పిల్లలకు ఇశ్రాయేలీయుల సమాధానబలులలో మీ వాటాగా ఇవ్వబడ్డాయి.
15
ప్రత్యేక అర్పణ యైన తొడను పైకెత్తిన రొమ్ము భాగాన్ని హోమబలుల క్రొవ్వుతో పాటు తీసుకువచ్చి, యెహోవా ఎదుట పైకెత్తి ప్రత్యేక అర్పణగా అర్పించాలి. యెహోవా ఆజ్ఞాపించినట్లు ఇది నీకు, నీ పిల్లలకు శాశ్వత వాటాగా ఉంటుంది.”
16
పాపపరిహారబలి కొరకైన మేక గురించి మోషే ఆరా తీయగా, అది కాలిపోయిందని తెలుసుకుని, అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు, ఈతామారులపై కోప్పడి,
17
“మీరు పాపపరిహారబలిని పరిశుద్ధాలయ ప్రాంగణంలో ఎందుకు తినలేదు? అది అతిపరిశుద్ధమైనది; సమాజం యొక్క అపరాధం యొక్క శిక్షను భరించి యెహోవా ఎదుట వారి కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన ఇది మీకు ఇచ్చారు.
18
దాని రక్తం పరిశుద్ధ స్థలంలోకి తేబడలేదు కాబట్టి నేను ఆజ్ఞాపించినట్లు, మీరు పరిశుద్ధాలయ ప్రాంతంలో మేకను తప్పక తిని ఉండాల్సింది” అని అన్నాడు.
19
అందుకు అహరోను మోషేతో, “ఈ రోజు వారు యెహోవా ఎదుట వారి పాపపరిహారబలి, దహనబలి అర్పించారు, అయినా నా పట్ల ఇలాంటి విషాదం జరిగింది. ఈ రోజు ఒకవేళ నేను పాపపరిహారబలి తినివుంటే యెహోవా ఆనందించి ఉండేవారా?” అని అడిగాడు.
20
ఆ మాటలు మోషే విని సంతృప్తి చెందాడు.
Settings