యెషయా 49:14-23
14
అయితే సీయోను, “యెహోవా నన్ను విడిచిపెట్టారు. ప్రభువు నన్ను మరచిపోయారు” అని అన్నది.
15
“తల్లి తన చంటిబిడ్డను మరచిపోతుందా? తాను కన్న బిడ్డ మీద జాలిపడకుండ ఉంటుందా? తల్లియైన మరచిపోవచ్చు కాని నేను నిన్ను మరవను!
16
చూడు, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకున్నాను; నీ గోడలు నిత్యం నా ఎదుట ఉన్నాయి.
17
నీ కుమారులు తొందరగా తిరిగి వస్తారు. నిన్ను నాశనం చేసినవారు నీ నుండి వెళ్లిపోతారు.
18
నీ కళ్ళెత్తి చుట్టూ చూడు; నీ పిల్లలందరు కలిసి నీ దగ్గరకు వస్తున్నారు. ‘వారందరిని నీవు ఆభరణంగా ధరించుకుంటావు; పెళ్ళికుమార్తెలా నీవు వారిని ధరించుకుంటావు. నా జీవం తోడని ప్రమాణం చేస్తున్నాను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.
19
“నీవు నాశనమై నిర్మానుష్యంగా చేయబడినా నీ దేశం పాడుబడినా నీ భూమి నీ ప్రజలకు ఇరుకుగా ఉంటుంది, నిన్ను మ్రింగివేసినవారు దూరంగా ఉంటారు.
20
నీవు కోల్పోయిన దుఃఖంలో ఉన్నప్పుడు పుట్టిన పిల్లలు, ‘ఈ స్ధలం మాకు ఇరుకుగా ఉంది. ఇంకా విశాలమైన స్ధలం మాకు ఇవ్వు’ అని నీవు వింటుండగా అంటారు.
21
అప్పుడు నీవు నీ హృదయంలో, ‘వీరిని నా కోసం ఎవరు కన్నారు? నేను నా పిల్లల్ని కోల్పోయిన గొడ్రాలిని; నేను బందీ అయ్యాను, తిరస్కరించబడ్డాను. ఈ పిల్లల్ని ఎవరు పెంచారు? నేను ఒంటరిగా విడిచిపెట్టబడ్డాను. కానీ వీరు ఎక్కడ నుండి వచ్చారు?’ ” అని అనుకుంటావు.
22
ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “చూడు, నేను దేశాలకు సైగ చేస్తాను, జనాంగాల వైపు నా జెండాను ఎత్తుతాను; వారు నీ కుమారులను తమ చేతుల్లో తీసుకువస్తారు నీ కుమార్తెలను తమ భుజాల మీద మోసుకువస్తారు.
23
రాజులు నిన్ను పోషించే తండ్రులుగా వారి రాణులు నీకు పాలిచ్చే తల్లులుగా ఉంటారు. వారు నీ ఎదుట తమ ముఖాన్ని నేలకు ఆనించి నమస్కారం చేస్తారు; నీ పాదాల దగ్గర ఉన్న దుమ్మును నాకుతారు. అప్పుడు నీవు, నేను యెహోవాను అని, నా కోసం నిరీక్షణతో ఉన్నవారు నిరాశ చెందరని తెలుసుకుంటావు.”
Settings