యెషయా 24:1-12
1
చూడండి, యెహోవా భూమిని పాడుచేసి నాశనం చేయబోతున్నారు; ఆయన దాని ఉపరితలాన్ని పాడుచేసి దానిలో నివసించేవారిని చెదరగొడతారు.
2
అందరికి ఒకేలా ఉంటుంది; ప్రజలకు కలిగినట్లే యాజకునికి, సేవకునికి కలిగినట్లే యజమానికి, సేవకురాలికి కలిగినట్లే యజమానురాలికి, కొనేవారికి కలిగినట్లే అమ్మేవారికి, అప్పు ఇచ్చేవారికి కలిగినట్లే అప్పు తీసుకునేవారికి, వడ్డీకి ఇచ్చేవారికి కలిగినట్లే వడ్డీకి తీసుకునేవారికి కలుగుతుంది.
3
భూమి పూర్తిగా పాడుచేయబడి పూర్తిగా దోచుకోబడుతుంది. యెహోవా ఈ మాట చెప్పారు.
4
భూమి ఎండిపోయి వాడిపోతుంది, లోకం క్షీణించి వాడిపోతుంది, ఆకాశాలు భూమితో పాటు క్షీణించిపోతాయి.
5
భూప్రజలును బట్టి భూమి అపవిత్రమైంది; వారు చట్టాలకు లోబడలేదు, వారు కట్టడలను ఉల్లంఘించారు వారు నిత్యనిబంధనను భంగం చేశారు.
6
కాబట్టి ఒక శాపం భూమిని మ్రింగివేస్తుంది; దాని ప్రజలు తమ అపరాధాన్ని భరించాలి. కాబట్టి భూనివాసులు కాలిపోయారు కేవలం కొద్దిమంది మిగిలారు.
7
క్రొత్త ద్రాక్షరసం ఎండిపోతుంది, ద్రాక్షతీగె వాడిపోతుంది; సంతోషంగా ఉన్నవారు మూల్గుతారు.
8
ఆనందంతో చేసే తంబురల ధ్వనులు నిలిచిపోయాయి, కేకలు వేసే వారి ధ్వని ఆగిపోయింది ఆనందంగా ఉన్న సితార నిశ్శబ్దంగా ఉంది.
9
ఇక వారు పాటలు పాడుతూ ద్రాక్షరసం త్రాగరు; మద్యం త్రాగే వారికి అది చేదుగా మారింది.
10
శిథిలమైన పట్టణం నిర్జనంగా ఉంది; ప్రతి ఇంటి గుమ్మం మూయబడింది.
11
ద్రాక్షరసం కోసం వారు వీధుల్లో కేకలు వేస్తున్నారు; ఆనందమంతా దిగులుగా మారుతుంది, దేశం ఆనంద ధ్వనులన్నీ నిషేధించబడ్డాయి.
12
పట్టణం శిథిలాల్లో ఉన్నది, దాని గుమ్మం ముక్కలుగా విరిగిపోయింది.
Settings