హెబ్రీయులకు 9:1-14
1
మొదటి నిబంధనలో దేవుని ఆరాధించడానికి కొన్ని నియమాలు, భూసంబంధమైన ప్రత్యక్ష గుడారం ఉన్నాయి.
2
ఆ గుడారం ఇలా ఏర్పరచబడింది. దానిలోని మొదటి గదిలో ఒక దీప దీపస్తంభం, ఒక బల్ల దానిపై అర్పించబడిన రొట్టెలు ఉన్నాయి, ఆ గదికి పరిశుద్ధ స్థలమని పేరు.
3
రెండవ తెర వెనుక అతి పరిశుద్ధ స్థలం అని పిలువబడే గది ఉంది,
4
దానిలో ధూపం వేయడానికి బంగారు బలిపీఠం, బంగారంతో కప్పబడిన నిబంధన పెట్టె ఉన్నాయి. ఆ పెట్టెలో మన్నా ఉంచబడిన బంగారు పాత్ర, చిగురించిన అహరోను కర్ర, వ్రాయబడిన నిబంధన రాతిపలకలు ఉన్నాయి.
5
ఈ పెట్టె పైన మహిమగల కెరూబులు తమ రెక్కలతో ప్రాయశ్చిత్త పీఠంను కాపాడుతూ ఉన్నాయి. అయితే ఈ సంగతుల గురించి వివరంగా ఇప్పుడు మనం చర్చించలేము.
6
ఇలా అన్ని ఏర్పాటు చేయబడిన తర్వాత, ప్రతిరోజు యాజకులు తమ పరిచర్యను చేయడానికి మొదటి గదిలోకి వెళ్తారు.
7
అయితే కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే లోపలి గదిలోకి ప్రవేశించాడు, అది కూడా సంవత్సరానికి ఒక్కసారే. తెలియక చేసిన పాపాల కోసం తన కోసం, ప్రజల కోసం అతడు అర్పించి ఆ రక్తాన్ని తీసుకెళ్లాలి, రక్తం లేకుండా వెళ్లడానికి లేదు.
8
అంటే మొదటి గుడారం నిలిచి ఉన్నంత కాలం అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్లే మార్గం ఇంకా తెరవబడలేదని పరిశుద్ధాత్మ దీని ద్వారా చూపిస్తున్నాడు.
9
ఇది ప్రస్తుత కాలాన్ని సూచించే ఒక ఉపమానం, దేవునికి అర్పించబడే కానుకలు, బలులు ఆరాధించేవారి మనస్సాక్షిని శుధ్ధిచేయలేవని తెలియజేస్తుంది.
10
అవి కేవలం తినడం త్రాగడం, వివిధ శుద్ధీకరణ ఆచారాలకు సంబంధించిన బాహ్య నియమాలు క్రొత్త క్రమం వచ్చేవరకు వర్తిస్తాయి.
11
అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న మంచి విషయాల యొక్క ప్రధాన యాజకునిగా క్రీస్తు వచ్చినప్పుడు, మానవుల చేతితో చేయబడని గొప్పదైన పరిపూర్ణమైన గుడారం గుండా ఆయన వెళ్లాడు, అంటే అది ఈ సృష్టిలో ఒక భాగం కాదు.
12
ఆయన మేకల దూడల రక్తాన్ని తీసుకుని ప్రవేశించలేదు; కాని శాశ్వత విమోచన సంపాదించడానికి స్వరక్తంతో అతి పరిశుద్ధ స్థలంలోకి ఆయన ఒక్కసారే ప్రవేశించాడు.
13
ఆచారపరంగా అపవిత్రులైనవారు బాహ్యంగా పవిత్రులయ్యేలా మేకల ఎడ్ల రక్తంను దహించబడిన దూడ బూడిదను వారిపై చల్లి వారిని పవిత్రులుగా చేస్తాడు.
14
నిత్యమైన ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొన్న క్రీస్తు రక్తం, మనం జీవంగల దేవుని సేవించేలా, మరణానికి నడిపించే వ్యర్థమైన క్రియల నుండి మన మనస్సాక్షిని ఇంకెంత ఎక్కువగా పవిత్రపరుస్తుంది!
Settings