దానియేలు 11:21-30
21
“అతని తర్వాత రాజ్య గౌరవం దక్కని నీచమైన వ్యక్తి అధికారంలోకి వస్తాడు. ప్రజలు సురక్షితంగా ఉన్నామని అనుకున్నప్పుడు, అతడు రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు, కాని కుట్రతో ఆక్రమించుకుంటాడు.
22
అప్పుడు అతని ఎదుట ఉప్పొంగే సైన్యం కొట్టుకుపోతుంది; అది, దాని నిబంధన అధికారి నాశనమవుతారు.
23
అతనితో సంధి చేసుకున్న తర్వాత అతడు కపటంగా వ్యవహరిస్తాడు, తనతో ఉన్న కొంతమంది ప్రజలతో మాత్రమే అధికారంలోకి వస్తాడు.
24
ధనికమైన ప్రాంతాలు సురక్షితంగా ఉన్నామని భావించినప్పుడు, అతడు వాటిని ఆక్రమించి, తన పితరులు, తన పూర్వికులు సంపాదించలేనిది సంపాదిస్తాడు. అతడు దోపుడుసొమ్మును, కొల్లగొట్టిన సొమ్మును, ధనాన్ని తన అనుచరులకు పంచిపెడతాడు. కోటలు పడగొట్టడానికి కుట్ర చేస్తాడు, కాని కొంతకాలం మట్టుకే.
25
“గొప్ప సైన్యంతో అతడు దక్షిణాది రాజు మీద తన బలాన్ని, ధైర్యాన్ని సమకూరుస్తాడు. దక్షిణాది రాజు చాల శక్తివంతమైన పెద్ద సైన్యం సమకూర్చుకొని యుద్ధం చేస్తాడు, కాని అతనికి విరుద్ధంగా వేసిన కుట్రలను బట్టి అతడు నిలువలేకపోతాడు.
26
రాజు భోజనం తినేవారు, అతన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తారు; అతని సైన్యం తుడిచివేయబడుతుంది, ఎంతోమంది యుద్ధంలో కూలిపోతారు.
27
ఆ ఇద్దరు రాజులు కీడును ఉద్దేశిస్తూ, ఒకే బల్ల దగ్గర కూర్చుని ఒకనితో ఒకడు అబద్ధాలు చెప్పుకుంటారు, కాని అది నిష్ప్రయోజనం, ఎందుకంటే అంతం దాని నిర్ణీత కాలంలో వస్తుంది.
28
ఉత్తరాది రాజు గొప్ప ఐశ్వర్యంతో తన స్వదేశానికి తిరిగి వస్తాడు, అయితే అతని హృదయం పరిశుద్ధ నిబంధనకు విరుద్ధంగా ఉంటుంది. దానికి విరుద్ధంగా కార్యం చేసి, తర్వాత తన స్వదేశానికి వెళ్లిపోతాడు.
29
“నిర్ణీత కాలంలో అతడు దక్షిణాది ప్రాంతం మీద మళ్ళీ దాడి చేస్తాడు, అయితే ఈసారి మునుపటి ఫలితానికి భిన్నంగా ఉంటుంది.
30
కిత్తీము అనగా పశ్చిమ తీర ప్రాంతాల ఓడలు అతన్ని వ్యతిరేకిస్తాయి, అతడు ధైర్యం కోల్పోతాడు. అప్పుడు అతడు తన దేశానికి తిరిగివెళ్లి, పరిశుద్ధ నిబంధనకు వ్యతిరేకంగా తన కోపాన్ని చూపిస్తాడు. అతడు తిరిగివెళ్లి పరిశుద్ధ నిబంధనను విడిచిపెట్టినవారి పట్ల దయ చూపిస్తాడు.
Settings