అపొస్తలుల కార్యములు 23:23-35
23
తర్వాత ఆ అధిపతి తన శతాధిపతులలో ఇద్దరిని పిలిచి, “రెండువందలమంది సైనికులు, డెబ్బైమంది గుర్రపురౌతులను రెండువందలమంది ఈటెల సైన్య పటాలంతో ఈ రాత్రి తొమ్మిది గంటలకు కైసరయకు వెళ్లడానికి సిద్ధపడండని ఆదేశించాడు.
24
అలాగే అధిపతియైన ఫెలిక్స్ దగ్గరకు పౌలును క్షేమంగా తీసుకెళ్లడానికి అతనికి గుర్రాన్ని ఇవ్వండి” అని ఆదేశించాడు.
25
అతడు ఈ విధంగా ఒక ఉత్తరం వ్రాశాడు:
26
క్లౌదియ లూసియ, మహా గౌరవనీయులైన ఫెలిక్స్ అధిపతికి, నా వందనాలు.
27
ఈ వ్యక్తిని యూదులు పట్టుకుని చంపబోతుంటే, ఇతడు రోమీయుడని తెలుసుకొని నేను సైనికులతో వెళ్లి రక్షించాను.
28
వారు అతన్ని ఎందుకు నిందిస్తున్నారో తెలుసుకోవడానికి, వారి న్యాయసభ ముందు అతన్ని నిలబెట్టాను.
29
వారు అతనిపై వారి ధర్మశాస్త్రానికి సంబంధించిన నిందలను మోపారు కాని, మరణశిక్ష వేయడానికి లేదా చెరసాలలో ఖైదీగా బంధించడానికి తగిన నేరమేదీ అతనిలో లేదు.
30
అతన్ని చంపాలని కుట్ర పన్నుతున్నారని నాకు తెలియగానే, ఇతన్ని మీ దగ్గరకు పంపాను అతని మీద నిందమోపే వారిని వారి ఫిర్యాదులను మీ ముందు చెప్పుకోవాలి అని ఆదేశించాను.
31
కాబట్టి సైనికులు, తమకు ఇచ్చిన ఆ దేశం ప్రకారం, రాత్రివేళ బయలుదేరి తమతో పౌలును యెరూషలేము నుండి అంతిపత్రి ప్రాంతానికి తీసుకెళ్లారు.
32
మరుసటిరోజు గుర్రాల దండును పౌలుతో పాటు పంపి, వారు సైనికుల కోటకు తిరిగి వచ్చారు.
33
ఆ గుర్రాల దండు కైసరయకు చేరిన తర్వాత, వారు ఆ ఉత్తరంతో పాటు పౌలును అధిపతికి అప్పగించారు.
34
ఆ అధిపతి ఆ ఉత్తరం చదివి, అతడు ఏ ప్రాంతానికి చెందిన వాడు అని అడిగాడు. అతడు కిలికియకు చెందినవాడని తెలుసుకొని,
35
“నీ మీద నేరం మోపిన వారు కూడా ఇక్కడకు వచ్చినప్పుడు నీ విషయాన్ని నేను విచారిస్తాను” అని చెప్పి, అతన్ని హేరోదు రాజగృహంలో కాపలా మధ్యలో ఉంచాలని ఆదేశించాడు.
Settings