Skip to content
అపొస్తలుల కార్యములు 2:22-36

అపొస్తలుల కార్యములు 2:22-36

22
“తోటి ఇశ్రాయేలీయులారా, ఇది వినండి: మీ కోసం దేవుని నుండి అధికారం పొందిన నజరేయుడైన యేసు ద్వారా అద్భుతాలను, మహత్కార్యాలను, సూచకక్రియలను దేవుడే మీ మధ్యలో చేయించారని మీకు కూడ తెలుసు.
23
దేవుడు తన భవిష్యత్ జ్ఞానాన్నిబట్టి నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం యేసు క్రీస్తును మీకు అప్పగించారు; అయితే మీరు, దుష్టుల సహాయంతో, ఆయనను సిలువకు మేకులు కొట్టి చంపారు.
24
కానీ మరణం ఆయనను బంధించి ఉంచడం అసాధ్యం, కాబట్టి దేవుడు ఆయనను మరణ వేదన నుండి విడిపించి, మృతులలో నుండి లేపారు.
25
దావీదు ఆయన గురించి ఇలా అన్నారు: “ ‘ఎల్లప్పుడు నేను నా ఎదుట నా ప్రభువును చూస్తున్నాను. నా ప్రభువు, నా కుడి ప్రక్కనే ఉన్నారు, కాబట్టి నేను కదల్చబడను.
26
కాబట్టి నా హృదయం సంతోషించి, నా నాలుక ఆనందిస్తుంది; నా శరీరం కూడా నిరీక్షణలో విశ్రమిస్తుంది,
27
ఎందుకంటే నీవు నా ఆత్మను మృతుల రాజ్యంలో విడిచిపెట్టరు, మీ పరిశుద్ధుని కుళ్లిపోనీయరు.
28
మీరు నాకు జీవమార్గాలను తెలిపారు; మీ సన్నిధిలోని ఆనందంతో నన్ను నింపుతారు.’
29
“తోటి ఇశ్రాయేలీయులారా, నేను మీతో నిస్సందేహంగా చెప్పగలను, మీ పితరుడైన దావీదు చనిపోయి పాతిపెట్టబడ్డాడు, అతని సమాధి ఇప్పటికీ మన మధ్య ఉంది.
30
అతడు ఒక ప్రవక్త దేవుడు అతని సంతానంలో ఒకనిని అతని సింహాసనం మీద కూర్చోబెడతానని ఒట్టు పెట్టుకుని తనకు ప్రమాణం చేశాడని దావీదుకు తెలుసు.
31
రాబోయేదాన్ని చూసిన ఆయన క్రీస్తు పునరుత్థానం గురించి మాట్లాడుతూ, ఆయన మృతుల రాజ్యంలో విడిచిపెట్టబడలేదని, ఆయన శరీరం కుళ్ళి పోవడం చూడలేదని చెప్పారు.
32
దేవుడు యేసును జీవంతో లేపారు, దీనికి మేమంతా సాక్షులము.
33
దేవుని కుడిచేతి వైపుకు ఎత్తబడి, తండ్రి చేసిన వాగ్దానం ప్రకారం పరిశుద్ధాత్మను పొందుకొని ఇప్పుడు మీరు చూస్తూ వింటున్న దానిని మీమీద కుమ్మరించారు.
34
దావీదు పరలోకానికి ఎక్కి పోలేదు అయినా ఇలా చెప్పాడు, “ ‘నేను నీ శత్రువులను నీకు పాదపీఠంగా చేసే వరకు
35
“నీవు నా కుడి వైపున కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పారు.” ’
36
“కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరు ఖచ్చితంగా తెలుసుకోవలసింది ఏంటంటే: మీరు సిలువ వేసిన ఈ యేసునే, దేవుడు ప్రభువుగా క్రీస్తుగా చేశారు.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options