2 రాజులు 19:20-28
20
అప్పుడు ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియాకు ఇలా సందేశం పంపాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: నీవు అష్షూరు రాజైన సన్హెరీబును గురించి నాకు చేసిన ప్రార్థన విన్నాను.
21
అతని గురించి యెహోవా చెప్పిన మాట ఇదే: “ ‘కన్యయైన సీయోను కుమార్తె నిన్ను తృణీకరించి ఎగతాళి చేస్తుంది. యెరూషలేము కుమార్తె నీవు పారిపోతుంటే తల ఊపుతుంది.
22
నీవు ఎవరిని నిందించి దూషించావు? ఎవరి మీద నీవు అరిచి గర్వంతో నీ కళ్ళెత్తి చూశావు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునినే గదా!
23
నీవు పంపిన దూతల ద్వారా ప్రభువును దూషించావు. నీవు అన్నావు, “నా అనేక రథాల చేత, పర్వత శిఖరాల మీదికి ఎక్కాను, లెబానోను ఎత్తైన స్థలాలను ఎక్కాను. దాని పొడువైన దేవదారులను నరికివేశాను, శ్రేష్ఠమైన సరళ వృక్షాలను నరికివేశాను. దాని చివరి సరిహద్దులను చేరుకున్నాను, దాని సారవంతమైన అడవులను చేరుకున్నాను.
24
నేను పరదేశి నేలలో బావులు త్రవ్వి అక్కడి నీళ్లు త్రాగాను. నా అరికాలితో ఈజిప్టు నది ప్రవాహాలన్నీ ఎండిపోయేలా చేశాను.”
25
“ ‘చాలా కాలం క్రితం నేనే నిర్ణయించానని, నీవు వినలేదా? పూర్వకాలంలో నేను సంకల్పించాను; ఇప్పుడు నేను అలా జరిగేలా చేశాను, నీవు కోటగోడలు గల పట్టణాలను రాళ్ల కుప్పలుగా చేసేలా చేశాను.
26
వారి ప్రజలు బలహీనులై, భయాక్రాంతులై అవమానం పాలయ్యారు. వారు పొలంలో మొక్కల్లా, పచ్చని మొక్కల్లా, ఇంటికప్పు మీద పెరిగే గడ్డిలా పెరగక ముందే వాడిపోయినట్టు ఉన్నారు.
27
“ ‘అయితే నీవు ఎక్కడ ఉన్నావో ఎప్పుడు వస్తావో ఎప్పుడు వెళ్తావో నా మీద ఎంత కోపంగా ఉన్నావో నాకు తెలుసు.
28
నీవు నాకు వ్యతిరేకంగా లేస్తున్నందుకు, నీ అహంకారం నా చెవిని చేరినందుకు, నా గాలాన్ని నీ ముక్కుకు తగిలిస్తాను, నా కళ్లెం నీ నోటిలో వేస్తాను. నీవు వచ్చిన దారిలోనే నీవు తిరిగి వెళ్లేలా చేస్తాను.’
Settings