1 సమూయేలు 2:22-29
22
ఇక చాలా ముసలివాడై ఏలీ, ఇశ్రాయేలీయులందరి పట్ల తన కుమారులు చేస్తున్న వాటి గురించి, వారు సమావేశ గుడారపు ద్వారం దగ్గరకు సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచరిస్తున్నారనే విషయాన్ని గురించి విన్నాడు.
23
కాబట్టి అతడు వారితో, “మీరు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు? మీరు చేసిన ఈ దుష్టమైన పనుల గురించి ప్రజలందరి నోటి నుండి నేను విన్నాను.
24
నా కుమారులారా, ఇలా చేయవద్దు. నేను విన్న ఈ విషయం యెహోవా ప్రజల మధ్యలో వ్యాపించడం మంచిది కాదు.
25
ఒక వ్యక్తి మరో వ్యక్తికి వ్యతిరేకంగా పాపం చేస్తే, దేవుడు ఆ అపరాధికి మధ్యవర్తిత్వం చేయవచ్చు; గాని ఎవరైనా యెహోవాకే వ్యతిరేకంగా పాపం చేస్తే వారి కోసం ఎవరు విజ్ఞాపన చేస్తారు?” అన్నాడు. అయితే వారిని చంపడం యెహోవా చిత్తం, కాబట్టి వారు తమ తండ్రి గద్దింపు వినలేదు.
26
మరోవైపు బాలుడైన సమూయేలు యెహోవా దయలో మనుష్యుల దయలో ఎదుగుతూ ఉన్నాడు.
27
తర్వాత ఒక దైవజనుడు ఏలీ దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘నీ పూర్వికుల కుటుంబం ఈజిప్టులో ఫరో క్రింద ఉన్నప్పుడు నన్ను నేను వారికి బయలుపరచుకోలేదా?
28
అతడు నా సన్నిధిలో నాకు యాజకునిగా ఉండి ఏఫోదు ధరించి, నా బలిపీఠం దగ్గరకు వెళ్లి ధూపం వేయడానికి ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటిలో నుండి నేను నీ పూర్వికున్ని ఏర్పరచుకున్నాను. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమబలులన్నిటిని నీ పూర్వికుని కుటుంబానికి ఇచ్చాను.
29
నా నివాసం కోసం నేను నిర్దేశించిన నా బలిని, అర్పణను ఎందుకు తృణీకరిస్తున్నారు? నా ప్రజలైన ఇశ్రాయేలీయులు అర్పించే ప్రతి అర్పణలో శ్రేష్ఠమైన భాగాలతో క్రొవ్వెక్కేలా చేసుకుని ఎందుకు నీవు నా కంటే నీ కుమారులను ఎక్కువగా గౌరవిస్తున్నావు?’
Settings