రోమీయులకు 14:1-12
1
వివాదాస్పదమైన అంశాలపై వాదన పెట్టుకోక విశ్వాసంలో బలహీనంగా ఉన్నవారిని చేర్చుకోండి.
2
ఒకరేమో తన విశ్వాసాన్నిబట్టి అన్నీ తినవచ్చు అని నమ్ముతున్నారు, మరొకరు తన బలహీనమైన విశ్వాసాన్నిబట్టి కేవలం కూరగాయలే తింటున్నారు.
3
అన్నిటిని తినేవారు అలా తినని వారిని చులకనగా చూడకూడదు, అలాగే అన్నిటిని తిననివారు తినేవారి మీద నింద వేయకూడదు. ఎందుకంటే దేవుడు వారిని అంగీకరించారు.
4
వేరేవాళ్ళ సేవకునికి తీర్పు తీర్చడానికి నీవెవరవు? అతడు నిలబడినా పడిపోయినా అది అతని యజమాని చూసుకుంటాడు. ప్రభువు వారిని నిలబెట్టడానికి శక్తిగలవాడు కాబట్టి వారు నిలబడతారు.
5
ఒకరు ఒక రోజును మరొక రోజు కన్నా మంచిదని భావిస్తారు. మరొకరు అన్ని రోజులు ఒకేలాంటివని భావిస్తారు. వారిరువురు తమ మనస్సుల్లో దానిని పూర్తిగా నమ్ముతారు.
6
ఒక రోజును మంచి రోజుగా భావించేవారు ప్రభువు కొరకే భావిస్తున్నారు. మాంసాన్ని తినేవారు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు కాబట్టి వారు ప్రభువు కొరకే తింటున్నారు. తిననివారు కూడా ప్రభువు కొరకే తినడం మాని, దేవునికి కృతజ్ఞతలను చెల్లిస్తున్నారు.
7
మనలో ఎవరు కేవలం తన కోసం మాత్రమే జీవించరు, తన కోసం మాత్రమే చావరు.
8
మనం జీవించినా ప్రభువు కోసమే, చనిపోయినా ప్రభువు కోసమే, కాబట్టి మనం జీవించినా మరణించినా ప్రభువుకు చెందినవారమే.
9
ఈ కారణంగానే, చనిపోయినవారికి జీవించి ఉన్నవారికి ప్రభువుగా ఉండడానికి క్రీస్తు మరణించి తిరిగి సజీవంగా లేచారు.
10
అయితే మనమందరం దేవుని న్యాయసింహాసనం ఎదుట నిలబడవలసి ఉండగా మీరు మీ సహోదరీ సహోదరులకు ఎందుకు తీర్పు తీర్చుతున్నారు? మీరు వారిని ఎందుకు తిరస్కరిస్తున్నారు?
11
దీని కోసం లేఖనంలో, “ప్రభువు ఇలా చెప్తున్నారు, ‘నా జీవం తోడని ప్రమాణం చేస్తున్నాను, ప్రతి మోకాలు నా ఎదుట వంగుతుంది, ప్రతి నాలుక దేవుని స్తుతిస్తుంది’” అని వ్రాయబడి ఉంది.
12
కాబట్టి, మనలో ప్రతి ఒక్కరు మన గురించి మనం దేవునికి లెక్క అప్పగించాలి.
Settings