Skip to content
లూకా 24:1-12

లూకా 24:1-12

1
వారం మొదటి రోజున తెల్లవారేటప్పుడు స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యాలను తీసుకుని సమాధి దగ్గరకు వచ్చారు.
2
వారు సమాధి రాయి దొర్లించబడి ఉండడం చూశారు,
3
కాని వారు ఆ సమాధిలోనికి వెళ్లినప్పుడు, అక్కడ ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు.
4
వారు ఈ విషయాన్ని గురించి కలవరపడుతూ ఉండగా, మిలమిల మెరుస్తున్న వస్త్రాలను ధరించిన ఇద్దరు మనుష్యులు వారి ప్రక్కన నిలబడి ఉండడం చూశారు
5
స్త్రీలు భయంతో తమ ముఖాలను నేలకు వంచుకొన్నారు కానీ ఆ పురుషులు వారితో, “మీరు సజీవుడైన వానిని మృతులలో ఎందుకు వెదకుతున్నారు?
6
ఆయన ఇక్కడ లేరు, ఆయన లేచారు! ఆయన మీతో గలిలయలో ఉన్నప్పుడు మీతో ఏం చెప్పాడో జ్ఞాపకం చేసుకోండి,
7
‘మనుష్యకుమారుడిని పాపుల చేతికి అప్పగించబడతాడు, వారు ఆయనను సిలువ వేసి చంపుతారు, ఆయన మూడవ రోజున సజీవంగా లేస్తాడని’ చెప్పాడు కదా!” అని అన్నారు.
8
అప్పుడు వారు ఆయన మాటలను జ్ఞాపకం చేసుకున్నారు.
9
వారు సమాధి నుండి తిరిగివెళ్లి, ఈ సంగతులను పదకొండు మంది శిష్యులకు మిగిలిన వారందరికి చెప్పారు.
10
శిష్యులకు అపొస్తలులకు ఈ విషయాన్ని చెప్పింది వీరే: మగ్దలేనే మరియ, యోహన్న, యాకోబు తల్లియైన మరియ ఇంకా వారితో ఉన్న ఇతర స్త్రీలు.
11
ఈ స్త్రీలు చెప్పిన మాటలు వారికి వెర్రి మాటలుగా అనిపించాయి, కాబట్టి వారు నమ్మలేదు.
12
అయితే పేతురు లేచి, సమాధి దగ్గరకు పరుగెత్తికొని పోయి, వంగి, నారబట్టలు మాత్రమే పడి ఉండడం చూసి, సమాధిలో ఏమి జరిగిందో అని ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్లిపోయాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options