న్యాయాధిపతులు 3:20-29
20
అతడు తన రాజభవనంలో మేడ గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్నప్పుడు ఏహూదు అతన్ని సమీపించి, “నా దగ్గర దేవుని నుండి మీకొక సందేశం ఉంది” అని అన్నాడు. రాజు తన సింహాసనం మీద నుండి లేస్తున్నప్పుడు,
21
ఏహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ ఖడ్గాన్ని తీసి రాజు పొట్టలో పొడిచాడు.
22
ఖడ్గం పిడి కూడ పొట్టలోనికి వెళ్లింది. ఏహూదు ఖడ్గాన్ని బయటకు లాగలేదు, ఖడ్గం పైనుండి క్రొవ్వు చుట్టుకుంది.
23
అప్పుడు ఏహూదు వాకిలి వైపు వెళ్లి తన వెనుక ఆ మేడగది తలుపులు వేసి వాటికి తాళం వేశాడు.
24
అతడు వెళ్లిన తర్వాత సేవకులు వచ్చి మేడగది తలుపులకు తాళం వేసి ఉందని చూశారు. వారు, “చల్లని గదిలో మూత్ర విసర్జనకు వెళ్లాడేమో” అనుకున్నారు.
25
వారు విసుగు చెందేటంత వేచి చూశారు, కాని అతడు తలుపులు తెరవలేదు కాబట్టి వారు ఒక తాళపుచెవితో తాళం తీశారు. అక్కడ తమ ప్రభువు నేలపై పడి చనిపోయి ఉండడం చూశారు.
26
వారు వేచి ఉన్నప్పుడు ఏహూదు వెళ్లిపోయాడు. అతడు రాతి ప్రతిమలను దాటి శేయీరాకు పారిపోయాడు.
27
అక్కడికి చేరినప్పుడు, అతడు వచ్చి ఎఫ్రాయిం కొండ సీమలో బూరను ఊదాడు, అప్పుడు ఇశ్రాయేలీయులు అతనితో కొండల దిగువకు వెళ్లారు, అతడు వారి నాయకుడయ్యాడు.
28
“నన్ను వెంబడించండి, యెహోవా మీ శత్రువైన మోయాబును మీ చేతికి అప్పగించారు” అని అతడు ఆదేశించాడు. కాబట్టి వారతన్ని వెంబడించి, మోయాబు వైపు నడిపించే యొర్దాను రేవులను స్వాధీనపరచుకున్నారు; ఏ ఒక్కరినైన దాటి వెళ్లడానికి వారు అనుమతించలేదు.
29
ఆ సమయంలో వారు శూరులైన బలమైన పదివేలమంది మోయాబీయులను హతం చేశారు; ఏ ఒక్కరు తప్పించుకోలేదు.
Settings