న్యాయాధిపతులు 11:13-22
13
అమ్మోనీయుల రాజు యెఫ్తా దూతలతో, “ఇశ్రాయేలు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పుడు, వారు అర్నోను నుండి యబ్బోకు వరకు, యొర్దాను వరకు ఉన్న నా దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు నాకు సమాధానంతో దానిని తిరిగి ఇచ్చేయాలి” అన్నాడు.
14
యెఫ్తా అమ్మోనీయుల రాజు దగ్గరకు దూతలను తిరిగి పంపించి,
15
“యెఫ్తా చెప్పేది ఇది: ఇశ్రాయేలు మోయాబు దేశాన్ని లేదా అమ్మోనీయుల దేశాన్ని తీసుకోలేదు.
16
ఇశ్రాయేలీయులు ఈజిప్టులో నుండి వచ్చినప్పుడు, వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యంలో నడిచి కాదేషుకు వచ్చారు.
17
అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజు దగ్గరకు దూతలను పంపి, ‘మీ దేశం గుండా వెళ్లడానికి మమ్మల్ని అనుమతించండి’ అని అడిగినప్పుడు, ఎదోము రాజు వినలేదు. వారు మోయాబు రాజును కూడా అడిగారు, అతడు తిరస్కరించాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు కాదేషులో నివాసం ఉన్నారు.
18
“తర్వాత వారు అరణ్యం గుండా ప్రయాణం చేస్తూ ఎదోము, మోయాబు దేశాల చుట్టూ తిరిగి, మోయాబుకు తూర్పుదిక్కు దాటి అర్నోను అవతలి వైపున మకాం వేశారు. అర్నోను మోయాబుకు సరిహద్దు కాబట్టి వారు మోయాబు సరిహద్దులోనికి ప్రవేశించలేదు.
19
“తర్వాత ఇశ్రాయేలీయులు హెష్బోనులో ఏలే అమోరీయుల రాజైన సీహోను దగ్గరకు దూతలను పంపి, ‘మా స్థలానికి వెళ్లడానికి మీ దేశం గుండా మమ్మల్ని వెళ్లనివ్వండి’ అని అడిగారు.
20
అయినప్పటికీ సీహోను ఇశ్రాయేలు తమ సరిహద్దు గుండా వెళ్లడం నమ్మలేదు. అతడు తన సైన్యాన్ని సమకూర్చుకొని, యహజు దగ్గర శిబిరం ఏర్పరచుకొని, అక్కడినుండి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశాడు.
21
“అప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సీహోనును, అతని సైన్యమంతటిని ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించారు, వారు వారిని ఓడించారు. ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశమంతటిని, ఆ దేశంలో నివసించేవారిని స్వాధీనం చేసుకుని,
22
అర్నోను నుండి యబ్బోకు వరకు, అరణ్యం నుండి యొర్దాను వరకు అమోరీయుల భూభాగాన్ని ఆక్రమించుకున్నారు.
Settings