యిర్మీయా 2:29-37
29
“నా మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నావు? మీరందరూ నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
30
“నేను వ్యర్థంగా నీ పిల్లలను శిక్షించాను; వారు దిద్దుబాటుకు స్పందించలేదు. నీ ఖడ్గం నీ ప్రవక్తలను, బాగా ఆకలిగా ఉన్న సింహంలా చంపింది.
31
“ఈ తరం వారలారా! యెహోవా మాటలు శ్రద్ధగా వినండి: “నేను ఇశ్రాయేలుకు ఎడారిగా మహా చీకటి దేశంగా ఉన్నానా? ఎందుకు నా ప్రజలు, ‘మేము స్వేచ్ఛగా తిరుగుతాము; ఇకపై మేము మీ దగ్గరకు రాము’ అని ఎందుకు అంటున్నారు?
32
ఒక యువతి తన నగలు, ఒక వధువు తన పెళ్ళి ఆభరణాలు మరచిపోతుందా? అయినా నా ప్రజలు లెక్కలేనన్ని రోజులు, నన్ను మరచిపోయారు.
33
ప్రేమను వెదకడంలో నీవు ఎంత నేర్పరివో! నీచమైన స్త్రీలు నీ నుండి నేర్చుకుంటారు.
34
నిర్దోషుల ప్రాణాధారమైన రక్తపు మరక నీ బట్టలపైన ఉంది. వారు లోపలికి చొచ్చుకొని వస్తూ ఉంటే నీవు వారిని పట్టుకోలేదు. ఇంత జరిగినా,
35
నీవు, ‘నేను నిర్దోషిని; ఆయనకు నా మీద కోపం రాదు’ అంటున్నావు. ‘నేను పాపం చేయలేదు’ అని అంటున్నావు, కాబట్టి నేను నీ మీద తీర్పు ప్రకటిస్తాను.
36
నీ మార్గాలను మార్చుకుంటూ, ఎందుకు అంతలా తిరుగుతున్నావు? నీవు అష్షూరులో నిరాశచెందినట్టుగా ఈజిప్టు విషయంలో కూడా నీవు నిరాశ చెందుతావు.
37
నీ తలపై చేతులు పెట్టుకుని ఆ స్థలం నుండి వెళ్లిపోతావు, ఎందుకంటే నీవు నమ్మేవారిని యెహోవా తిరస్కరించారు; నీవు వారి ద్వారా సహాయం పొందలేవు.
Settings