నిర్గమకాండము 7:19-25
19
యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నారు, “నీవు అహరోనుతో ఇలా చెప్పు, ‘నీ కర్రను తీసుకుని ఈజిప్టు జలాల మీద అనగా వారి నదులు కాలువలు చెరువులు, అన్ని జలాశయాల మీద చాపు, అప్పుడు అవన్నీ రక్తంగా మారుతాయి.’ ఈజిప్టులో ఎటు చూసినా రక్తమే ఉంటుంది. చివరికి చెక్క, రాతి పాత్రల్లో కూడా.”
20
మోషే అహరోనులు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారమే చేశారు. అతడు ఫరో ఎదుట అతని సేవకుల ఎదుట తన కర్రను పైకి లేపి నైలు నది నీటిని కొట్టగా, దాని నీరంతా రక్తంగా మారాయి.
21
నైలు నదిలోని చేపలు చనిపోయి, నది కంపు కొట్టడంతో ఈజిప్టువారు ఆ నీటిని త్రాగలేకపోయారు. ఈజిప్టులో ఎటు చూసినా రక్తమే కనబడింది.
22
అయితే ఈజిప్టు మంత్రగాళ్ళు కూడా తమ మంత్రవిద్యతో వాటిని చేశారు, అయితే యెహోవా వారితో చెప్పిన ప్రకారమే ఫరో హృదయం కఠినంగా మారి అతడు వారి మాటలను వినిపించుకోలేదు.
23
దానికి బదులు, ఫరో తన రాజభవనానికి తిరిగి వెళ్లిపోయాడు, కనీసం జరిగిన వాటి గురించి ఆలోచించలేదు.
24
ఈజిప్టు వారంతా నైలు నది నీటిని త్రాగలేక త్రాగునీటి కోసం నది ప్రక్కన త్రవ్వారు.
25
యెహోవా నైలు నదిని కొట్టి ఏడు రోజులు గడిచాయి.
Settings