అపొస్తలుల కార్యములు 27:27-38
27
పద్నాలుగవ రోజు రాత్రి మేము ఇంకా అద్రియా సముద్రంలో కొట్టుకొనిపోతుండగా, ఇంచుమించు అర్థరాత్రి సమయంలో ఓడను నడిపేవారు ఒడ్డును సమీపిస్తున్నాం అని గ్రహించారు.
28
వారు ఇనుప గుండు కట్టిన తాడు సముద్రంలో వేసి చూసి దానితో అక్కడ సుమారు నూట ఇరవై అడుగుల లోతుందని తెలుసుకున్నారు. మరికొద్ది సేపటికి సముద్రపు లోతును కనుగొనే దానిని మరలా వేసి తొంభై అడుగుల లోతుందని తెలుసుకొన్నారు.
29
మేము రాతి దిబ్బలకు గుద్దుకొంటామేమో అనే భయంతో వారు నాలుగు లంగరులను ఓడ మూలలో నుండి క్రిందకు వేసి, పగటి వెలుగు కోసం ప్రార్థించాము.
30
ఓడ నడిపేవారు ఓడలో నుండి పారిపోవాలని, తాము ఓడ ముందు భాగం నుండి కొన్ని లంగరులను పడవేయడానికి వెళ్తున్నట్లు నటిస్తూ రక్షక పడవను సముద్రంలోకి దింపారు.
31
అప్పుడు పౌలు శతాధిపతితో, సైనికులతో, “ఈ మనుష్యులు ఓడలో ఉంటేనే తప్ప తమ ప్రాణాలను రక్షించుకోలేరు” అని చెప్పాడు.
32
వెంటనే సైనికులు రక్షకపడవ దూరంగా కొట్టుకొని పోవడానికి దాని త్రాళ్లను కోసివేశారు.
33
తెల్లవారుతునప్పుడు పౌలు వారందరిని ఆహారం తినమని వేడుకున్నాడు. “గత పద్నాలుగు రోజులనుండి ఏమి జరుగుతుందో అని మీరు ఏమి తినలేదు.
34
మీరు బలహీనం కాకుండా దయచేసి భోజనం చేయండి, మీలో ఎవరి తల నుండి ఒక్క వెంట్రుక కూడా రాలదు” అని వారిని బ్రతిమాలాడు.
35
అతడు ఈ మాటలను చెప్పిన తర్వాత, రొట్టెను తీసుకుని వారందరి ముందు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి దానిని విరిచి తినడం ప్రారంభించాడు.
36
అప్పుడు వారందరు ధైర్యం తెచ్చుకుని కొంత ఆహారం తిన్నారు.
37
ఓడలో మొత్తం 276 మంది వ్యక్తులం ఉన్నాము.
38
వారు తమకు కావలసినంత ఆహారం తిన్న తర్వాత, ఓడను తేలిక చేయడానికి ధాన్యాన్ని సముద్రంలో పడవేశారు.
Settings