Skip to content
2 రాజులు 21:1-22

2 రాజులు 21:1-22

1
మనష్షే రాజైనప్పుడు అతని వయస్సు పన్నెండేళ్ళు, అతడు యెరూషలేములో యాభై అయిదు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హెఫ్సిబా.
2
అతడు యెహోవా దృష్టికి చెడుగా ప్రవర్తించాడు, ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్లగొట్టిన జనాలు చేసే హేయక్రియలు చేశాడు.
3
తన తండ్రి హిజ్కియా పడగొట్టిన క్షేత్రాలను అతడు తిరిగి కట్టించాడు; ఇశ్రాయేలు రాజైన అహాబు చేసినట్టు అతడు బయలు బలిపీఠాలను కట్టి, అషేరా స్తంభాన్ని చేశాడు. అతడు నక్షత్ర సమూహమంతటికి మ్రొక్కి వాటిని పూజించాడు.
4
యెహోవా తన మందిరాన్ని ఉద్దేశించి, “యెరూషలేములో నా పేరు ఉంచుతాను” అని చెప్పిన ఆ యెహోవా మందిరంలో అతడు బలిపీఠాలను కట్టించాడు.
5
యెహోవా మందిరంలో ఉన్న రెండు ఆవరణాల్లో నక్షత్ర సమూహమంతటికి అతడు బలిపీఠాలు కట్టించాడు.
6
అతడు తన సొంత కుమారుడిని అగ్నిలో బలి ఇచ్చాడు, భవిష్యవాణిని ఆచరించాడు, శకునాలను కోరాడు, మృతులతో మాట్లాడేవారిని ఆత్మలతో మాట్లాడేవారిని సంప్రదించాడు. అతడు యెహోవా దృష్టిలో చాలా చెడుగా ప్రవర్తిస్తూ ఆయనకు కోపం రేపాడు.
7
అతడు చెక్కించిన అషేరా స్తంభాన్ని తీసి ఆలయంలో నిలిపాడు. ఆ ఆలయం గురించి యెహోవా దావీదుకు, అతని కుమారుడైన సొలొమోనుకు, “ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో నేను ఎన్నుకున్న యెరూషలేములో, ఈ దేవాలయంలో నా పేరు నిత్యం ఉంచుతాను.
8
నేను వారికి నా సేవకుడైన మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రమంతటిని ఆచరిస్తూ నేను వారికి ఆజ్ఞాపించినదంతా జాగ్రత్తగా వారు పాటిస్తే, వారి పూర్వికులకు ఇచ్చిన దేశంలో నుండి నేను ఇశ్రాయేలీయుల పాదాలను తిరిగి వెళ్లనివ్వను” అని చెప్పారు.
9
అయితే ప్రజలు మాట వినలేదు. మనష్షే వారిని తప్పుదారి పట్టించాడు, కాబట్టి ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండ యెహోవా నాశనం చేసిన దేశాల కంటే ఎక్కువ చెడు చేశారు.
10
యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఇలా మాట్లాడారు:
11
“యూదా రాజైన మనష్షే ఈ అసహ్యకరమైన పాపాలు చేశాడు. అతనికంటే ముందు ఉన్న అమోరీయుల కంటే మించి చెడు చేశాడు, అతడు విగ్రహాలతో యూదాను తప్పుదారి పట్టించాడు.
12
కాబట్టి ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: నేను యెరూషలేము మీదికి, యూదా మీదికి విపత్తు రప్పిస్తాను. ఆ విపత్తును గురించి విన్న వారందరి చెవులు గింగురుమంటాయి.
13
నేను సమరయకు వ్యతిరేకంగా ఉపయోగించిన కొలమానాన్ని, అహాబు ఇంటిపై ఉపయోగించిన మట్టపు గుండును యెరూషలేము మీద వ్రేలాడదీస్తాను. ఒకడు గిన్నె తుడిచి బోర్లించినట్టు నేను యెరూషలేమును తుడిచివేస్తాను.
14
వారసత్వంగా ఉన్న నా ప్రజల్లో మిగిలిన వారి చేయి విడిచి, వారిని శత్రువుల చేతికి అప్పగిస్తాను. వారు తమ శత్రువులందరిచేత దోచుకోబడతారు;
15
వారి పూర్వికులు ఈజిప్టు నుండి వచ్చిన రోజు నుండి ఈ ఒక రోజు వరకు నా దృష్టిలో చెడుగా ప్రవర్తిస్తూ నాకు కోపం రేపారు.”
16
యూదా వారు యెహోవా దృష్టిలో తప్పుగా ప్రవర్తించేటట్టు మనష్షే వారిని తప్పుదారి పట్టించడమే గాక, చాలామంది నిరపరాధుల రక్తాన్ని, యెరూషలేము ఆ చివర నుండి ఈ చివర వరకు చిందించాడు.
17
మనష్షే పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసిన పాపం గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
18
మనష్షే చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. ఉజ్జా తోటలో అతని రాజభవన తోటలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడైన ఆమోను రాజయ్యాడు.
19
ఆమోను రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు, అతడు యెరూషలేములో రెండేళ్ళు పరిపాలించాడు. అతని తల్లి హారూసు కుమార్తెయైన మెషుల్లెమెతు; ఆమె యోత్బా పట్టణానికి చెందినది.
20
అతడు తన తండ్రి మనష్షేలా యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.
21
అతడు తన తండ్రి జీవిత విధానాన్ని పూర్తిగా అనుసరిస్తూ, తన తండ్రి కొలిచిన విగ్రహాలను కొలిచి పూజించేవాడు.
22
అతడు తన పూర్వికుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టాడు, ఆయన మార్గాలను అనుసరించలేదు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options