లేవీయకాండము 24:10-23
10
ఒక రోజు ఇశ్రాయేలు తల్లికి ఈజిప్టు తండ్రికి పుట్టిన కుమారుడు ఇశ్రాయేలీయుల మధ్యకు వెళ్లాడు, అక్కడ శిబిరంలో అతనికి, ఒక ఇశ్రాయేలీయునికి మధ్య గొడవ జరిగింది.
11
ఇశ్రాయేలు స్త్రీ కుమారుడు యెహోవా నామాన్ని దూషిస్తూ శపించాడు; కాబట్టి వారు అతన్ని మోషే దగ్గరకు తీసుకువచ్చారు. (అతని తల్లి పేరు షెలోమీతు, దాను గోత్రానికి చెందిన దిబ్రీ కుమార్తె.)
12
యెహోవా చిత్తం వారికి తెలిసే వరకు వారు అతన్ని అదుపులో ఉంచారు.
13
అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు,
14
“ఆ దైవదూషకున్ని శిబిరం బయటకు తీసుకెళ్లు. అతని మాటలు విన్న వారంతా అతని తలపై చేతులుంచగానే సమాజమంతా రాళ్లతో అతన్ని కొట్టి చంపాలి.
15
ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఎవరైనా తమ దేవున్ని శపిస్తే, తమ పాపశిక్షను భరించాలి;
16
యెహోవా నామాన్ని ఎవరైనా దూషిస్తే, వారు మరణశిక్షకు గురి అవుతారు. సమాజమంత వారిని రాళ్లతో కొట్టి చంపాలి. విదేశీయులైనా, స్వదేశీయులైనా, యెహోవా నామాన్ని దూషిస్తే, వారికి మరణశిక్ష విధించాలి.
17
“ ‘ఎవరైనా మనుష్యుని చంపితే వారికి మరణశిక్ష విధించాలి.
18
ఎవరైనా జంతువును చంపితే ప్రాణానికి బదులుగా ప్రాణమిచ్చి నష్టపరిహారం చెల్లించాలి.
19
పొరుగువారిని ఎవరైనా గాయపరిస్తే, వారిని కూడా అలాగే గాయపరచాలి:
20
ఎముక విరగ్గొడితే ఎముక విరగ్గొట్టాలి, కంటికి కన్ను, పంటికి పన్ను. గాయం చేసిన మనుష్యునికి గాయం చేయాలి.
21
ఎవరైనా జంతువును చంపితే నష్టపరిహారం చెల్లించాలి కాని ఎవరైనా మనిషిని చంపితే, వారికి మరణశిక్ష విధించాలి.
22
విదేశీయులకు స్వదేశీయులకు ఒకే చట్టం ఉండాలి. నేను మీ దేవుడనైన యెహోవాను.’ ”
23
అప్పుడు మోషే ఇశ్రాయేలీయులతో మాట్లాడిన తర్వాత వారు దైవదూషకున్ని శిబిరం బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేశారు.
Settings